
DNews: Nov 21: సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్ డ్రైవర్పై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కారుకు సైడ్ ఇవ్వలేదన్న కోపంతో గంగాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి మద్యం మత్తులో బస్ను వెంబడించి ఆపి, బస్లోకి ఎక్కి డ్రైవర్ బాలరాజుపై దాడి చేశాడు. తలపై కొట్టి, తన్నుతూ అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటనను ప్రయాణికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా అతను పట్టించుకోలేదు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ప్రయాణికులు ఈ దాడి దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగిపై దాడి చేయడం ఘోరమైన చర్య అని ఆయన ఖండించారు. బాధిత డ్రైవర్ బాలరాజుతో ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని, తప్పక న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. బాలరాజు కన్నీటి పర్యంతమై “నేను ఎన్నేళ్లుగా ఎలాంటి తప్పులు లేకుండా పనిచేశాను, ఉత్తమ డ్రైవర్ అవార్డు కూడా పొందాను. నా తప్పు లేకుండా అతను మద్యం తాగి నన్ను కొట్టి తన్నాడు” అని భావోద్వేగంతో చెప్పాడు. మంత్రి వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసు అధికారులు డ్రైవర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దాడి చేసిన కార్ డ్రైవర్ శ్రీకాంత్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. సిరిసిల్ల సీఐ ప్రభుత్వ ఉద్యోగులపై విధి నిర్వహణలో దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
