
DNews: Nov 19: దిల్లీ: రాష్ట్ర పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా దిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై స్పందించారు. దిల్లీ కాలుష్యాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. రోడ్లపై పేరుకుపోయే ధూళి మరియు వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇందులో భాగంగా దిల్లీలో అనేక ప్రాంతాల్లో కాలుష్య హాట్స్పాట్లను గుర్తించినట్లు చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి సిర్సా, దిల్లీలో సుమారు 62 హాట్స్పాట్లను గుర్తించామని తెలిపారు. వీటిని నియంత్రించగలిగితే కాలుష్యం మరింత తగ్గుతుందని చెప్పారు.
ఈ సందర్భంలో దిల్లీ ప్రజలకు ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. కాలుష్యాన్ని ఎదుర్కొనే ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు శుభ్రమైన గాలిని అందించేందుకు ఈ యుద్ధంలో తమతో కలిసి పోరాడాలని కోరారు. కాలుష్యానికి కారణాలు ఏమిటన్న విషయంపై తమ ప్రభుత్వం పరిశోధనలు చేస్తున్నదని మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు.
