
DNews:04 NOV:నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కాసనగోడు గ్రామంలో చోటుచేసుకున్న హృదయ విదారక సంఘటన, శిశు సంక్షేమ కేంద్రాల (అంగన్వాడీ) నిర్వహణలో ఉన్న తీవ్ర నిర్లక్ష్యాన్ని కళ్ళకు కట్టింది. పేద దంపతుల నాలుగేళ్ల కుమారుడు అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.
నల్గొండ జిల్లా, కాసనగోడుకు చెందిన జగదీష్, శ్రావణి దంపతులు హైదరాబాద్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన ఈ దంపతులు, తమ నాలుగేళ్ల కుమారుడు అయాన్ను కాసనగోడులో ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రంలో వదిలి వెళ్ళారు. గ్రామంలో పిల్లలు తక్కువగా ఉండటంతో రెండు అంగన్వాడీ కేంద్రాలను కలిపి నిర్వహిస్తున్నారు.మధ్యాహ్నం సమయంలో బాలుడు అయాన్ బహిర్భూమికి వెళ్ళాలని ఆయాకు చెప్పాడు. ఇక్కడే తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. అంగన్వాడీ కేంద్రం ఆవరణలోనే మరుగుదొడ్లు ఉన్నప్పటికీ, ఆయా ఆ వసతిని వినియోగించకుండా, బాలుడిని సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న బహిరంగ ప్రాంతానికి తీసుకువెళ్లింది.
బహిర్భూమి తర్వాత అయాన్ కడుక్కునేందుకు పక్కనే ఉన్న నీటి గుంత వద్దకు వెళ్ళాడు. ఇటీవలి వర్షాల కారణంగా ఆ ప్రాంతం పాకురు పట్టి ఉండటంతో, బాలుడు పట్టుతప్పి ఆ నీటి గుంతలో పడిపోయాడు.బాలుడు నీటి గుంతలో పడిపోవడంతో ఆయా భయంతో పెద్దగా కేకలు వేసింది. చుట్టుపక్కల ఉన్న యువకులు వెంటనే గుంతలోకి దిగి అయాన్ను వెతికారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. నీటిలో ఊపిరాడక అప్పటికే ఆ చిన్నారి విగతజీవిగా మారిపోయాడు. ఆ పసిబిడ్డ తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఎంతటి ఘోరాన్ని మిగిల్చిందో ఈ ఘటన తెలియజేస్తోంది.
తమ కుమారుడి మృతికి అంగన్వాడీ టీచర్, ఆయా నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు అంగన్వాడీ కేంద్రం వద్ద తీవ్ర ఆందోళనకు దిగారు. బాధతో రగిలిపోయిన కుటుంబ సభ్యులు బాలుడి మృతదేహంతో రాత్రిపూట అంగన్వాడీ టీచర్ ఇంటి ఎదుట కూడా ఆందోళన నిర్వహించారు.ఈ ఘటనపై కేతేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్వాడీ టీచర్తో పాటు, ఆయాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
