
DNews:27 Jan: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ ఉత్కంఠకు తెరపడనుంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను నేడు 27, 2026 మధ్యాహ్నం 3.45 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందుకోసం ఎస్ఈసీ కార్యాలయంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రకటన వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ (Model Code of Conduct) అమలులోకి రానుంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ విడుదలకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), డీజీపీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు సిబ్బంది నియామకంపై జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా అంటే మార్చి 15వ తేదీలోపు పూర్తి చేసేలా కమిషన్ కసరత్తు చేస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈసారి రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఓటర్ల తుది జాబితాను కూడా ఈనెల 16నే ప్రచురించారు. కోర్టు వివాదాల్లో ఉన్న కొన్ని స్థానాలను మినహాయించి, మిగిలిన అన్ని చోట్ల ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ మొగ్గు చూపుతోంది. రాజకీయ పార్టీలు ఇప్పటికే ఈ ఎన్నికల కోసం తమ ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి.
