
దేశ రాజధాని న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బొల్లార్డులు, భద్రతా బారికేడ్లను గురువారం అధికారులు తొలగించారు. పాకిస్థాన్ హైకమిషన్ వీసా విభాగం సమీపంలో ఏర్పాటు చేసిన క్యూ లైనర్లు సహా కొన్ని నిర్మాణాలు.. హైకమిషన్కు నిర్దేశించిన పరిధికి వెలుపల ఉన్న రోడ్డులో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు వాటిని తొలగించినట్లు సమాచారం.
ఈ పరిణామం ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ వెలుపల పాకిస్థాన్ అధికారులు భద్రతా బారికేడ్లను తొలగించిన మూడు రోజుల తర్వాత చోటుచేసుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని వార్తా సంస్థ ANI వెల్లడించింది. దీంతో ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్న చర్యలకు ప్రతిచర్యగా తాజా పరిణామాన్ని పరిగణిస్తున్నారు.
సైట్కు సంబంధించిన దృశ్యాల్లో ధ్వంసమైన రైలింగులు, గేట్లు, మెటల్ ఫ్రేములు, రూఫింగ్ షీట్లు, ఇటుకలు, కాంక్రీట్ ముక్కలు బయట చెల్లాచెదురుగా కనిపించాయి. హైకమిషన్ బయటి ఫెన్సింగ్లోని కొన్ని భాగాలతో పాటు రూఫింగ్ షీట్లను కూడా తొలగించినట్లు దృశ్యాలను బట్టి తెలుస్తోంది.
శిథిలాల మధ్య పాకిస్థాన్ హైకమిషన్ వీసా విభాగం కనిపించింది. అక్కడ “Window 1”, “Pakistani Passport Only”, “Window-5 / Collection of Visa Applications” అనే సూచికలు ఉన్నాయి.
అయితే ఈ నిర్మాణాల తొలగింపునకు పాకిస్థాన్ చేసిన దౌత్యపరమైన నిరసనకు సంబంధం ఉందన్న విషయంపై ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ లేదు. కశ్మీర్పై అమెరికా రాయబారి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పాకిస్థాన్ వ్యక్తం చేసిన అభ్యంతరాలతో ఈ చర్యకు సంబంధం ఉందని అధికారులు కూడా బహిరంగంగా వెల్లడించలేదు.
ప్రస్తుతం ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల బారికేడ్లు, బొల్లార్డుల తొలగింపు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ చర్య వెనుక అసలు కారణం ఏమిటన్న దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
