
DNews:1 NOV:జోగులాంబ గద్వాల జిల్లా, ఎర్రవల్లి మండలంలోని ధర్మవరం బీసీ వసతిగృహంలో (BC Hostel) ఆహారం కలుషితమై (Food Poison) తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో దాదాపు 53 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.
వసతిగృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా, సంఘటన జరిగిన శుక్రవారం రోజున 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత, రాత్రి 9 గంటల సమయంలో, ఏకంగా 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు.వసతిగృహం సిబ్బంది మరియు పోలీసులు వెంటనే అప్రమత్తమై, అస్వస్థతకు గురైన విద్యార్థులను అంబులెన్స్లో గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన అనంతరం చాలా మంది విద్యార్థులు కోలుకున్నారు. ప్రస్తుతం 53 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ వెంటనే స్పందించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా 53 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం వాస్తవమేనని అంగీకరించారు. జిల్లా యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి, విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించడం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం అదుపులో ఉందని, తల్లిదండ్రులు లేదా ఇతరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు. వైద్యులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, మెరుగైన చికిత్స అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
