
DNews:27 Jan: సింగరేణి బొగ్గు గనుల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం నేడు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ స్కామ్పై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి లేదా సీబీఐ (CBI) చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని గవర్నర్ను కోరింది.
సింగరేణిలో ఓవర్ బర్డెన్ (OB) మరియు సోలార్ టెండర్ల నిబంధనలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మార్చిందని, తద్వారా సుమారు రూ. 6,000 కోట్ల అవినీతికి తెరలేపిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే నిబంధనను తెరపైకి తెచ్చి తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకే టెండర్లు దక్కేలా చేశారని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువుల ప్రమేయం ఉందని, ఇప్పటికే నైని బొగ్గు బ్లాక్ టెండర్ రద్దు కావడం ఈ ఆరోపణలకు బలాన్నిస్తోందని వారు గవర్నర్కు వివరించారు.
గవర్నర్తో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, బొగ్గు స్కామ్ను బయటపెట్టినందుకు కక్ష సాధింపుగా తమ పార్టీ నేతలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. ఒకవైపు సింగరేణి నిధులను ఫుట్బాల్ మ్యాచ్ వంటి కార్యక్రమాలకు మళ్లిస్తూ మరోవైపు సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని, ప్రజాధనం లూటీ కాకుండా కాపాడాలని గవర్నర్కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
