
DNews:23 OCT:మహబూబాబాద్ : వరంగల్లోని నమస్తే తెలంగాణ యూనిట్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. టీయూడబ్ల్యూజే 143 మహబూబాబాద్ జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు, ప్రజాసంఘాలు కలిసి ఆందోళన చేపట్టాయి.
వారు మాట్లాడుతూ, “మీడియాపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడులే” అని హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అనుచరులు వరంగల్ మడికొండలోని నమస్తే తెలంగాణ యూనిట్ కార్యాలయంపై దాడి చేశారు. సుమారు 150 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండాలతో వచ్చి, పత్రిక ప్రతులను చింపి వేసి, ఆఫీస్ సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. సిబ్బందిని, మహిళా ఉద్యోగిని బూతులు తిట్టినట్టు సమాచారం.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులపై వార్తలు రాస్తే పరిణామాలు భరించాల్సి వస్తుందని బెదిరించారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్, సిబ్బంది మడికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులు దీనిని “మీడియా స్వేచ్ఛను అణచివేయాలనే కుట్ర”గా పేర్కొంటూ తీవ్రంగా ఖండించారు.
