
బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగణ్, షారుక్ ఖాన్, టైగర్ ష్రాఫ్కు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిషేధంలో ఉన్న పాన్ మసాలా ఉత్పత్తిని ప్రచారం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారం నేపథ్యంలో గతంలో అజయ్ దేవగణ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో పాన్ మసాలా ప్రకటనలపై స్పందించిన అజయ్ దేవగణ్.. బ్రాండ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
“ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఏదైనా యాడ్లో నటించే ముందు అది హానికరమైనదా కాదా అనే విషయాన్ని తెలుసుకుంటాం. కొన్ని బ్రాండ్లకు ప్రచారం చేయకూడదని నేను నిర్ణయించుకున్నాను. అందుకే వాటి పేర్లు చెప్పడం లేదు. గతంలో కేవలం యాలకులకు సంబంధించిన ప్రకటనలో మాత్రమే నటించాను. ఒకవేళ ఆ ఉత్పత్తులు నిజంగా అంత హానికరమైనవైతే వాటి విక్రయాలను పూర్తిగా నిషేధించాలి కదా” అని అజయ్ దేవగణ్ పేర్కొన్నారు.
కాగా, షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్లకు ఆగస్టు 11న మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. నిషేధిత ఉత్పత్తులను ప్రమోట్ చేయడంపై వారి వివరణ కోరినట్లు సమాచారం.
గతంలో ఇదే తరహా ప్రకటనలో షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్తో పాటు అక్షయ్ కుమార్ కూడా కనిపించారు. అయితే పాన్ మసాలా ప్రకటన ద్వారా పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారంటూ అభిమానులు, నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో అక్షయ్ కుమార్ ఆ యాడ్ నుంచి తప్పుకున్నారు.
ఇప్పుడు మహారాష్ట్ర FDA నోటీసుల నేపథ్యంలో అజయ్ దేవగణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
