
DNews:05 Feb: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “పుట్టు అజ్ఞానులకు జ్ఞానం పెరగదు.. దానికి రేవంత్ రెడ్డి ఒక సరైన ఉదాహరణ” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో లేదా బయట చర్చల సందర్భంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు, ఆయన వాడే భాష బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఏమాత్రం తగదని మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక, రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని జగదీష్రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యంగా విద్యుత్ రంగం మరియు ప్రాజెక్టుల విషయంలో అవగాహన లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై కక్షసాధింపు చర్యల కోసం ఎంతగా దిగజారడానికైనా రేవంత్ వెనకాడటం లేదని, ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని విచారణలు చేసినా తాము భయపడబోమని ఆయన స్పష్టం చేశారు. అహంకారంతో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని జగదీష్రెడ్డి హెచ్చరించారు.
