
DNational 13 Mar: పకోడీలు తినాలని ఉందంటూ భర్తను బస్టాండ్లో షాపుకు పంపించి, ఒక నవవధువు అక్కడి నుండి మాయమైన వింత ఘటన ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
అమ్రోహా జిల్లాకు చెందిన పీతమ్ సింగ్ అనే యువకుడికి, రాంపూర్ జిల్లాకు చెందిన రింజిమ్ (18) అనే యువతితో గతేడాది డిసెంబర్ 1న వివాహం జరిగింది. హోలీ పండుగ కోసం పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి తీసుకురావడానికి పీతమ్ సింగ్ వెళ్ళాడు. మార్చి 9న వారిద్దరూ కలిసి బస్సులో వస్తుండగా, మధ్యాహ్నం 2 గంటల సమయంలో బిలారి బస్టాండ్ వద్ద బస్సు ఆగింది.
ఆ సమయంలో తనకు ఆకలిగా ఉందని, పకోడీలు కావాలని రింజిమ్ తన భర్తను కోరింది. భార్య కోరిక మేరకు పీతమ్ సింగ్ బస్సు దిగి సమీపంలోని క్యాంటీన్కు వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి బస్సులో ఉండాల్సిన భార్య కనిపించలేదు. ఆందోళనతో చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పీతమ్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు.
మొరాదాబాద్ పోలీసులు రింజిమ్ అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తన భార్య తన గ్రామానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తితో కలిసి వెళ్లిపోయి ఉండవచ్చని పీతమ్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు టెక్నికల్ ఆధారాల ద్వారా ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
