
DNews: Apr09: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ వివాదాలకు తెరదించుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలకు భూమిపై పూర్తి హక్కులు కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం సచివాలయంలో జరిగిన రెవెన్యూ శాఖ సమీక్షలో, సుమారు 75 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే అనేక వరాలను ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న భూ గందరగోళాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం రీ-సర్వే 2.0ను వేగవంతం చేసింది. మార్చి 2027 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాస్బుక్ల పంపిణీని పూర్తి చేయడంతో పాటు, ఇప్పటికే సర్వే పూర్తయిన 1,259 గ్రామాలకు సంబంధించి జూలై నాటికి 9 లక్షల పాస్బుక్లను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జూలై తర్వాత, వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 80 లక్షల పాస్బుక్లను పంపిణీ చేసేందుకు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించారు.
