
DNews: Feb 05: మెదక్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్ల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు చేశారు. రైతులకు ఇప్పటివరకు ‘రైతు బంధు’ నిధులు జమ కాలేదని, ఫిబ్రవరి 11లోపు ఖాతాల్లోకి డబ్బులు రాకపోతే రైతులు ప్రభుత్వ దుర్మార్గాల ఫలితాన్ని చూపుతారని హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్సులు ఇస్తూ, పురుషులకు టికెట్ ధరలను రెట్టింపు చేయడం అన్యాయం అని ఆయన అన్నారు. రుణమాఫీ పేరుతో దేవుడినే మోసం చేసిన వ్యక్తి రేవంత్ అని, ఇకపై రైతులు ఆయన అబద్ధాలను నమ్మరని వ్యాఖ్యానించారు. “రేవంత్ రెడ్డి, మీరు ముఖ్యమంత్రివా లేక వీధి రౌడీనా?” అని ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ పార్టీ గెలిచే ధైర్యం లేక ఓటమి భయంతో బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభపెట్టి పార్టీ మారుస్తుందని ఆరోపించారు. ఎవరు అమ్ముకుంటున్నారో, ఎవరు దొంగతనం చేస్తున్నారో గుర్తుంచుకుని, సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా బదులు ఇస్తామని స్పష్టం చేశారు. కేటీఆర్ చెప్పినట్లయితే మేము పదవులకు రాజీనామా చేసి ఆంధ్ర పాలకులను ఎదుర్కొంటామని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాజీనామా స్థానంలో జిరాక్స్ పేపర్ పంపిన దొంగ అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంపై తుపాకీ చూపిన దేశద్రోహి అని ఆయన అభివర్ణించారు.
ఆరు హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధింపులు చేస్తున్నారని ఆరోపించారు. ‘సిగాచీ’ ప్రమాదంలో 52 మంది కార్మికులు మరణిస్తే ఒక్కొక్కరికి కోట్ల రూపాయల పరిహారం ఇస్తామని సీఎం హామీ ఇచ్చి, ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా పరిహారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ.5,000 ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేయాలని హరీశ్ పిలుపునిచ్చారు. ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే బీజేపీ రాష్ట్రానికి బడ్జెట్లో తుపాకీ ఇస్తుందని ఆయన విమర్శించారు.
