
DNews: Jan 08: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో మాజీ ఐపీఎస్ అధికారి వి.కే.సింగ్ నివాసం వద్ద అర్ధరాత్రి ఒక వ్యక్తి హంగామా సృష్టించిన ఘటన కలకలం రేపింది. డిసెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి తర్బీజ్ అనే వ్యక్తి వి.కే.సింగ్ ఇంటి ముందు రోడ్డు నిర్మాణ పనుల కారణంగా ఏర్పాటు చేసిన బారికేడ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగినట్లు సమాచారం. అతను ఇంటి గేటు వద్ద తలుపులు కొట్టి వి.కే.సింగ్పై దాడి చేయడానికి ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదుపు చేయడానికి ప్రయత్నించిన సిబ్బంది వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడని, అలాగే “నేను 500 మంది తోడుకొని నీ ఇంటికి వస్తాను” అని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై వి.కే.సింగ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది జస్వంత్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
